
విశాఖ పట్నం, 1 నవంబర్ (హి.స.), :విశాఖపట్నం నగరంలోని ఒక డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులే కారణమని సహచర విద్యార్థులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు... స్థానిక ఎంవీపీ కాలనీ నాలుగో సెక్టార్లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ కోన సూరిబాబు పెద్ద కుమారుడు సాయితేజ (22) సమతా డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో స్టాటిస్టిక్స్ అధ్యాపకురాలు తనను నిత్యం వేధిస్తున్నారని, పరీక్షల్లో జవాబులు బాగా రాసినా మార్కులు వేయడం లేదని, రికార్డులు అధికంగా రాయిస్తున్నారని విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పాడు. అధ్యాపకుల వేధింపులపై యాజమాన్యంతో మాట్లాడేందుకు సాయితేజ తల్లిదండ్రులు, మామయ్య శుక్రవారం ఉదయం కాలేజీకి వెళ్లారు. అక్కడ ఉండగానే వారు ఇంట్లో ఉన్న సాయితేజతో రెండుసార్లు ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు స్పందించలేదు. దీంతో ఇంటికి వెళ్లి చూసేసరికి ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతిచెంది ఉన్నాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ