
జోగులాంబ గద్వాల, 1 నవంబర్ (హి.స.)
జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరం బీసీ హాస్టల్లో కలుషితాహారం (ఫుడ్ పాయిజనింగ్) కారణంగా మొత్తం 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన పై జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తక్షణమే స్పందించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందిస్తున్న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించి, ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. హాస్టల్లో మొత్తం 110 మంది విద్యార్థులు ఉండగా, అందులో 54 మందికి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపించాయి. వీరందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరికీ ప్రమాదం లేదని భరోసా ఇచ్చారు. ఇప్పటికే చికిత్స పూర్తయిన 32 మంది విద్యార్థులను డిశ్చార్జ్ చేశామని, మిగతా 22 మందిని మధ్యాహ్నం వరకు అబ్జర్వేషన్లో ఉంచి పంపుతామని తెలిపారు. వచ్చినప్పుడు ఒకరిద్దరు మాత్రమే డీహైడ్రేషన్ అయ్యారని, మిగతా వారందరూ భయంతోనే ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు