
నల్గొండ, 12 నవంబర్ (హి.స.)
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కిష్టరాంపల్లి, నక్కలగండి ప్రాజెక్ట్ ల భూ నిర్వాసితుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదని ఈ భూనిర్వాసితులను పట్టించుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలితే నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా, మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లాలో మాట్లాడిన కవిత.. గతంలో కేసీఆన్ు లక్ష తిట్లు తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. నల్లగొండ అంటేనే పోరాటాల పురిటిగడ్డ అని సాయుధ రైతాంగ పోరాటంలో.. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలోనూ ఈ జిల్లా కీలక పాత్ర పోషించిందన్నారు. కృష్ణా జలాలపై ఆధారపడి ఉన్న ఈ ప్రాంతానికి నాగార్జునసాగర్ కూతవేటు దూరంలో ఉన్నా సాగు, తాగు నీరు లేదని విమర్శించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు