
తిరుపతి, 12 నవంబర్ (హి.స.)
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం పుష్కరిణి వద్ద తాజాగా అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. పుష్కరిణిలో స్నానాలకు అనుమతి ఇవ్వకపోవడంపై అయ్యప్ప స్వాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్తీక మాసం ప్రారంభం నుంచి కోనేరులో స్నానాలకు, దీపారాధనలకు విజిలెన్స్ అధికారులు అనుమతించలేదు. ఈ క్రమంలోనే కపిలతీర్థం వద్ద అయ్యప్ప భక్తుల ఆందోళనకు దిగారు. ప్రతి రోజూ స్నానాలకు అనుమతి ఇవ్వాలి.. అంటూ స్వాములు నినాదాలు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్.. అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు అక్కడికి చేరుకొని భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు.
టీటీడీ అధికారులు భక్తులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అయ్యప్ప భక్తులు ఆందోళనతో అధికారులు దిగొచ్చారు. బుధవారం తెల్లవారుజామున పుష్కరిణీలో అయ్యప్ప భక్తులు స్నానాలకు అనుమతి ఇచ్చారు. ఆందోళన చేసినప్పుడే కాదు.. ప్రతి రోజూ వదలండి అంటూ భక్తులు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. కపిలతీర్థం పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ పెరిగింది. అధికారులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అదనపు భద్రతా సిబ్బందిని నియమించినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV