
తాడిపత్రి, 12 నవంబర్ (హి.స.)అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీడీపీ, వైసీపీ వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందుజాగ్రత్త చర్యగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు.
వివరాల్లోకి వెళితే.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రజాపోరు పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అదే సమయంలో, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు.
ఒకే రోజు రెండు ప్రధాన పార్టీలు కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని భావించిన పోలీసులు, కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ ఉదయం ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక పార్టీ ఇన్ఛార్జిగా నేను కార్యక్రమం చేసుకోకూడదా? నా ర్యాలీని ఎలా అడ్డుకుంటారు? అంటూ ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన శాంతించలేదు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో లిఖితపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV