
పుట్టపర్తి, 14 నవంబర్ (హి.స.), శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. అనంతరం విద్యార్థుల వేద పఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. వేలాదిమంది భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. వేడుకల్లో పాల్గొంటున్న భక్తులకు నారాయణ సేవను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ప్రారంభించారు. నారాయణ సేవ కింద రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తారు. పుట్టపర్తిలో 20 అడుగుల పొడవు, 26 అడుగుల వెడెల్పు ఉన్న సత్యసాయి శత జయంతి ఉత్సవాల గ్యాస్ బెలూన్ను ఆర్జే రత్నాకర్ ఎగురవేశారు. బెంగళూరు బృందావనంలో ప్రారంభమైన సత్యసాయి విద్యార్థుల సైకిల్ ర్యాలీ గురువారం సాయంత్రం హిల్వ్యూ స్టేడియానికి చేరుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ