
తిరుపతి, 14 నవంబర్ (హి.స.)
శ్రీవారి దర్శనార్థం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమలకు రానున్నారు. ఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయానికి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి తిరుమలకు వెళ్లి అక్కడే బస చేస్తారు. శనివారం శ్రీవారిని దర్శించుకుని విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇక, సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగానియమితులైన జస్టిస్ సూర్యకాంత్ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు రాంచీ నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. రోడ్డు మార్గాన నేరుగా తిరుమల వెళ్లి పద్మావతి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుని స్వామివారిని దర్శించుకోనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి, ఆదివారం తిరిగి శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్కు బయలుదేరి వెళ్లనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ