
హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.)
షాద్నగర్ బైపాస్ రోడ్డుపై సాంఘిక
సంక్షేమ గురుకుల కాలేజీ విద్యార్థినులు చేపట్టిన ఆందోళనపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. అసలేం జరుగుతున్నది తెలంగాణలో అని సీఎం రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు.
ప్రిన్సిపల్ శైలజ వేధింపులు తట్టుకోలేక ఎన్హెచ్ 44పై గురుకుల విద్యార్థినులు ఆందోళన చేశారు. మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ విద్యార్థినులపై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యార్థినులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వాహనాల్లో ఎక్కించడం దారుణమన్నారు. అసలేం జరుగుతున్నది తెలంగాణలో రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.
ఇదేనా ఇందిరమ్మ పాలనలో అమ్మాయిలకు అందుతున్న న్యాయం. విద్యా శాఖ మంత్రిగా వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, ఇలా అరెస్ట్ చేస్తారా? మహిళల గురించి కాంగ్రెస్ సర్కార్ చెప్పేదొకటి.. చేసేదొకటి.. జూబ్లిహిల్స్లో మహిళలే మిమ్మల్ని ఓడించి, మీకు బుద్ది చెప్తారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు