
అమరావతి, 2 నవంబర్ (హి.స.)రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులకు సర్వీసు కాలం రెండేళ్ల నుంచి ఏడాదికి మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పదేళ్లపాటు పదోన్నతులకు నోచుకోని పంచాయతీ కార్యదర్శులకు ఇప్పుడు ఏడాదిలోనే రెండు పదోన్నతులు పొందే అవకాశం దక్కింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్ ఉద్యోగులకు స్వర్ణయుగంగా మారింది. డీఎల్డీల నుంచి కిందిస్థాయి పంచాయతీ కార్యదర్శుల వరకు అన్ని కేడర్లకూ పదోన్నతులు కల్పించడం ద్వారా రాష్ట్రంలో సుమారు 10 వేల మందికి పదోన్నతులు లభిస్తున్నాయి. ఇప్పటికే గ్రామ, వార్డ్ సచివాలయ వ్యవస్థ జిల్లా, మండల స్థాయిలో మానిటరింగ్ వ్యవస్థ తీసుకురావడంతో 660 మంది గ్రామ, వార్డ్ సచివాలయ అధికారులను నియమించాల్సి వచ్చింది. పంచాయతీరాజ్లోని డిప్యూటీ ఎంపీడీవో కేటగిరీకి చెందిన అధికారులను ఆ స్థానాల్లో నియమించాల్సి రావడంతో పంచాయతీరాజ్శాఖలో గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాల్సి వచ్చింది. దీంతో రెండేళ్ల సర్వీసును ఏడాదికి కుదించి.. వారికి ఏడాది నిండినా, పదోన్నతి కల్పించేందుకు సర్వీసు రూల్స్ను సవరించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 474 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి లభించనుంది. గ్రేడ్-1 కార్యదర్శులు 90 మంది, గ్రేడ్-2.. 43 మంది, గ్రేడ్-3.. 131 మంది, గ్రేడ్-4 కార్యదర్శులు 200 మంది, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం, డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్లు 10 మందికి ఈ సర్వీసు మినహాయింపు లభించనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ