
అమరావతి, 6 డిసెంబర్ (హి.స.)
ఉక్కునగరం, : విశాఖ ఉక్కు యాజమాన్యం విలువైన ఉక్కును తుక్కు పేరుతో తక్కువ ధరకు విక్రయించేందుకు పూల్డ్ ఉక్కుగా నేలపాలు చేస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నరసింగరావు డిమాండ్ చేస్తున్నారు. ‘కర్మాగారం బ్లాస్ట్ ఫర్నెస్ విభాగంలోని హాట్ మెటల్ స్టీల్మెల్టింగ్ షాప్(ఎస్ఎంఎస్)కు వెళ్లకుండా స్క్రాప్ పిట్టులో పోసి తుక్కు(స్క్రాప్)గా తయారు చేయడం నష్టమని గతంలో ఎస్ఎంఎస్-2లో జరిగిన ప్రమాదం సందర్భంగా దిల్లీలోని స్టీల్ జాయింటు సెక్రటరీ సంజయ్రాయ్ తనను కలసిన కార్మిక సంఘాల నాయకులతో అన్నారు. వెంటనే పూల్డ్ ఐరన్ ఉత్పత్తి నిలుపుదల చేయాలని ఆదేశించారు. ఒక వేళ తయారు చేయాలంటే కమిటీ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఓ కమిటీని కూడా నియమించారు. ఏడాది కాలంగా పూల్డ్ ఐరన్ ఉత్పత్తిని నిలిపి వేశారు. ఇప్పుడు కమిటీ నిర్ణయం లేకుండానే ఇన్ఛార్జి సీఎండీ ఆదేశాలతో ఈనెల 2వ తేదీ నుంచి పూల్డ్ ఐరన్ ఉత్పత్తి చేస్తున్నారు. మూడో తేదీన 300 టన్నులు, నాలుగో తేదీన 600 టన్నుల పూల్డ్ ఐరన్ తయారు చేశారు. ప్రస్తుతం ఉత్పత్తికి సరపడా ముడి సరుకు అందుబాటులో లేదు. ఈ పరిస్థితుల్లో పూల్్్డ ఐరన్ ఉత్పత్తి చేయడం నష్టదాయకం. విశాఖ ఉక్కులో ఉత్పత్తి జరగడం లేదని, కార్మికులు పనిచేయడం లేదని చెబుతున్న యాజమాన్యం ఉత్పత్తి చేసిన ఉక్కును నేలపాలు చేయడం, తక్కువ ధరకు గుత్తేదార్లకు ముట్టజెప్పడం దారుణమ’ని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. బ్లాస్ట్ ఫర్నెస్లో ఉత్పత్తి అయిన హాట్మెటల్ను ఫినిష్డ్ సీˆ్టల్గా తయారు చేస్తే టన్నుకు రూ.50వేల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు పూల్డ్ ఐరన్ తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారని సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ