
అమరావతి, 6 డిసెంబర్ (హి.స.)ఏపీ జెన్కో హైడల్ సామర్థ్యం మరో 230 మెగావాట్లు పెరగనుంది. ఏపీ-ఒడిశా సరిహద్దులోని లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టులో ఒక్కోటి 115 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లు శరవేగంగా సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 115 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లు ఉన్నాయి. అదనపు యూనిట్ల నిర్మాణానికి సంబంఽధించిన సివిల్ పనులు దాదాపు పూర్తయ్యాయని, టర్బయిన్లు, ఇతర పరికరాలను ఏర్పాటు చేసేందుకు బీహెచ్ఈఎల్ సిద్ధమవుతోందని జెన్కో అధికారులు తెలిపారు. వచ్చే మార్చి నాటికి 5వ, మే నాటికి 6వ యూనిట్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. దీంతో పవర్ ప్రాజెక్టు సామర్థ్యం 690 మెగావాట్లకు చేరుకుంటుంది. రోజుకు సగటున 5 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. శ్రీశైలం కుడికాల్వ పవర్ ప్రాజెక్టు సామర్థ్యం 770 మెగావాట్లు. రాష్ట్రంలో శ్రీశైలం తర్వాత లోయర్ సీలేరు రెండో అతిపెద్ద హైడల్ ప్రాజెక్టుగా నిలవనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ