హైదరాబాద్, 9 జూన్ (హి.స.)
సోమవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మంత్రుల శాఖల పునర్ వ్యవస్థీకరణపై పార్టీ పెద్దలతో వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మంత్రుల శాఖల కేటాయింపు విషయంలో రేవంత్ రెడ్డి తన నివేదికతో ఢిల్లీకి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల వద్ద కొంత మందికి రెండు మూడు శాఖలు ఉన్నాయి. వీరిలో ఎవరెవరూ సమర్థవంతంగా పని చేస్తున్నారు ఎవరెవరూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే పూర్తి వివరాలతో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు సీనియర్ మంత్రులకు సంబంధించి శాఖల్లో మార్పు ఉండబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు హోంశాఖను కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్, ఇతర ముఖ్యమైన కేసులు కీలక దశలో ఉన్నాయి. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులు ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో వీరికి కేటాయించే శాఖల విషయంపై సీఎం చర్చించనున్నట్లు సమాచారం. ఇక శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, వాకిటి శ్రీహరికి మున్సిపల్ శాఖ, అడ్లూరికి ఎస్సీ సంక్షేమం, వివేక్ కు విద్యా శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..