మోతిహారీ (బిహార్): 9 జూలై (హి.స.)పేదలు, సామాజికంగా అణగారిన వర్గాల పేరిట రాజకీయాలు చేసే కాంగ్రెస్, ఆర్జేడీలకు సొంత కుటుంబాలనే తప్ప ఇతర నేతలను పట్టించుకోని అహంకారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బిహార్లో యూపీఏ కాలం నాటి ప్రతీకార రాజకీయాలకు తాము ముగింపు పలికామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి విరివిగా నిధులు కేటాయించడంతో మునుపెన్నడూ లేనంతగా ప్రగతిపథంలో ముందుకు పోతోందన్నారు. ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న బిహార్లో శుక్రవారం పర్యటించిన ప్రధాని రూ.7,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా తూర్పు చంపారణ్ జిల్లాలోని మోతిహారీలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్, ఆర్జేడీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యోగాల పేరుతో పేదల భూములు లాక్కొన్న ఆర్జేడీ సంకెళ్లను రాష్ట్ర ప్రజలు తెంచుకున్నారని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ‘బనాయేంగే నయా బిహార్.. ఫిర్ ఏక్బార్ ఎన్డీయే సర్కార్’ అనే కొత్త నినాదాన్ని ఇచ్చి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ