న్యూఢిల్లీ: 20 జూలై (హి.స.)ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ కఠిన పదజాలంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు. మణిపూర్ సంక్షోభం గురించి పట్టించుకోకుండా మోడీ ఎక్కువగా టీవీల్లో కనిపిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని తరుచుగా మీడియాకు రావడాన్ని ఖర్గే తప్పుపట్టారు. మోడీ ప్రతీ రోజూ టీవీల్లో కనిపిస్తారని, ఆయన టీవీ స్ట్రీన్పై లేని రోజు లేదని, ప్రభుత్వ టెలివిజన్ దూరదర్శన్ ఉన్నప్పటికీ, గతంలో ఏ ప్రధాని కూడా రోజూ తెల్లవారుజామున టీవీల్లో మొరిగింది లేదని ఖర్గే విమర్శించారు.
మైసూర్ లో కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ఖర్గే ప్రసంగిస్తూ తీవ్ర స్థాయిలో మోడీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని హత్య చేశారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్లను దేశ ప్రజలు అనుమతించరని అన్నారు. మోడీ రాజ్యాంగం కారణంగా సీఎం, పీఎం అయ్యారని, పార్లమెంట్లో ప్రవేశించే ముందు రాజ్యాంగానికి తలవంచారని, కానీ అదే రాజ్యాంగాన్ని ఆయన హత్య చేస్తున్నారంటూ ఆరోపించారు. మణిపూర్లో హింస చెలరేగుతున్న ఆయన పట్టించుకోవడం లేదని, మోడీ 42 దేశాలు పర్యటిస్తారు కానీ, సొంత దేశంలో మణిపూర్ లాంటి ప్రాంతాన్ని పర్యటించలేదని, అక్కడికి వెళ్లడానికి భయపడుతున్నారా..? అని ప్రశ్నించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ