అమరావతి, 20 జూలై (హి.స.)
,:తక్కువ ఖర్చుతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి విస్తృతంగా పరిశోధనలు జరగాలని గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ అభిప్రాయపడింది. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో రెండు రోజులు జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ శనివారం ముగిసింది. రెండో రోజు మేధావులు పలు అంశాలపై చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్లో మూడు గ్రీన్ హైడ్రోజన్ పరిశోధన క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి, జాతీయ స్థాయిలో వలే గ్రీన్ హైడ్రోజన్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ను నెలకొల్పడానికి, హరిత ఉదజని ఉత్పత్తి ఖర్చును సగానికి తగ్గించేందుకు నిరంతరం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు రాష్ట్రంలో కొనసాగించడానికి ఈ సదస్సులో డిక్లరేషన్ రూపొందించారు. ఆ డిక్లరేషన్ని సోమవారం ప్రభుత్వానికి నివేదించనున్నారు. సదస్సులో చర్చించిన అంశాలను ఎస్ఆర్ఎం గ్రూపు సంస్థల రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డి.నారాయణరావు వివరించారు. తొలి రోజు సీఎం సమక్షంలో జరిగిన రూ. 51 వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో పాటు అమెరికాకు చెందిన సినర్జెన్ సీఈవో ప్రణవ్ తాంతి ఆంధ్రప్రదేశ్లో మరో 40 వేల టన్నుల సామర్థ్యం గల గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమ ఏర్పాటుకు అంగీకారం తెలిపారని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చుని రూ. 400 నుంచి రూ. 200కు తగ్గించాలని, వచ్చే రెండు, మూడేళ్లలో హైడ్రోజన్తో నడిచే కారు, రైలుని వినియోగంలోకి తీసుకురావాలని డిక్లరేషన్లో పొందుపరిచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొ-వైస్చాన్స్లర్ డాక్టర్ సతీష్ కుమార్, నెడ్క్యాప్ ఏపీ ఎండీ కమలాకర్బాబు, సుజిత్ ఎంఎన్ఆర్ఈ నుంచి డాక్టర్ సుజిత్ పిళ్లై, మారం పార్థసారథి, సుజిత్ కల్లూరి పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ