మాచర్ల, 20 జూలై (హి.స.)
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు, మున్సిపల్ మాజీచైర్మన్ తురకా కిశోర్కు మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. 2022, అక్టోబరు 7న పార్టీ మారడం లేదన్న కారణంతో టీడీపీ నేత దారపనేని శ్రీనివాసరావుపై కిశోర్, బోదలవీడుకు చెందిన మేదరమెట్ల శ్రీను, పంగులూరి బాబు మరికొందరు దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో కేసు నమోదు చేయలేదు. తాజాగా నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ శ్రీనివాసరావు మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో తురకా కిశోర్, ఇతర నిందితులపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కిశోర్ సహా నిందితులలను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. అయితే.. కిశోర్ను శనివారం ఒకరోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు సాయంత్రం వరకు విచారించారు. అనంతరం మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచగా న్యాయాధికారి శ్రీనివాస్ కల్యాణ్ ఈ నెల 29 వరకూ రిమాండ్ విధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ