
మేడ్చల్ మల్కాజ్గిరి, 21 మే (హి.స.)
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్న
డంపింగ్ యార్డ్ ప్రజల ప్రాణాలను హరించే పెనుభూతంగా మారిందని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో దోమలు అధికంగా పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జవహర్ నగర్ డంపింగ్ యార్డు, స్థానిక సమస్యలపై గురువారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అధ్యక్షతన ఎల్. బి నగర్ లోని ఓ హోటల్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రతిరోజూ సుమారు 8500 నుంచి 12,500 టన్నుల చెత్త జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారని, 339 ఎకరాల విస్తీర్ణంలో పేరుకుపోయిన చెత్త నుండి వెలువడుతున్న దుర్గంధపు నీరు సమీప చెరువులు, బోర్ల నీటిని కలుషితం చేస్తోందని స్థానికులు పేర్కొన్నారు. భూగర్భ జలాలు కూడా కలుషితం కావడంతో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని తెలిపారు. పక్షులు, జంతువులు కూడా నివసించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..