
తిరుమల, 22 మే (హి.స.)తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఎండాకాలం సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో రద్దీ కొనసాగుతూనే ఉంది. నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నిర్వహించే అభిషేక సేవలో సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు.
భక్తుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దాదాపు 5,850 మంది భక్తులకు శ్రీవారి అభిషేకసేవ వీక్షించే అవకాశం కల్పించినట్టు వెంకయ్య చౌదరి చెప్పారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై సామాన్య భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గురువారం సైతం స్వామి వారిని భారీగా భక్తులు దర్శించుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV