
అమరావతి, 23 మే (హి.స.)
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మహిళా వివాదంలో అరవ శ్రీధర్ పేరు వినిపించడంతో, పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనను అమరావతికి పిలిపించినట్లు సమాచారం. ఈ భేటీలో తనపై వచ్చిన ఆరోపణలు, వివాదాలపై అరవ శ్రీధర్.. పవన్ కల్యాణ్కు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఇలాంటి అంశాలు భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకూడదని పవన్ కల్యాణ్ సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే ఈ వివాదం నేపథ్యంలో అరవ శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. అలాగే ఆయనపై వచ్చిన ఆరోపణలపై పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ నివేదికను కూడా పవన్ కల్యాణ్కు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య అరవ శ్రీధర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో విప్గా కొనసాగుతున్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు స్వయంగా అందజేసినట్లు సమాచారం. ఇక, అరవ శ్రీధర్ తన రాజీనామాపై స్పందిస్తూ వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం ఇటీవల నెలకొన్న వివాదాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే చిర్రి బాలరాజును కూడా పవన్ కల్యాణ్ అమరావతికి పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశాలు జనసేన పార్టీలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల ప్రవర్తన, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే అంశాలపై పవన్ కల్యాణ్ కఠిన వైఖరి అవలంబిస్తున్నారనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ