
హైదరాబాద్, 23 మే (హి.స.)
మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని వందశాతం రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 'హరీష్ రావు.. బీఆర్ఎస్లోలో మీ ఫ్యూచర్ ఏంటో మీకే తెలియదు. అలాంటి మీరు ఫ్యూచర్ సిటీని ఆపుతారా?' అంటూ ఎద్దేవా చేశారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై ఇవాళ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన మంత్రి.. మెరికాలో ఉండి ఫ్యూచర్ సిటీని ఆపేస్తాం అంటూ ప్రకటించిన హరీశ్ రావు.. ఈ భూములను తాకట్టు పెట్టడానికి అమెరికాలో ఎవరితోనైనా ఒప్పందం చేసుకున్నారా? అని ప్రశ్నించారు.
పదేండ్లలో హైదరాబాద్లో కనీసం ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టని మీకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఒక నగరమే నిర్మిస్తున్నదంటే అసూయ కలగక తప్పదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం ఎక్కడ పడితే అక్కడ ఫాంహౌస్లు కట్టుకున్నారు. కానీ మేము రాష్ట్రం కోసం, దేశం కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే, ఆపుతాం అంటున్నారని మండిపడ్డారు. మూసీని బాగుచేస్తామంటే అడ్డుపడుతున్నారు, ఇండస్ట్రీస్ పెట్టి యువతకు ఉద్యోగాలిస్తామంటే కుట్రచేసారు, ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ఆపుతాం అంటున్నారని దుయ్యబట్టారు.
అధికారంలోకి వస్తామంటూ హరీశ్ రావు పగటి కలలు కంటున్నారని కానీ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనిధీమా వ్యక్తం చేశారు. దేశం గర్వించే విధంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని స్పష్టం చేశారు. మీ పొలిటికల్ ఫ్యూచర్ ఖతం చెయ్యాలి అని మీ మామా మీ బామ్మర్ది చూస్తున్నారు.. ఫ్యూచర్ లేని బీఆర్ఎ ఎస్ పార్టీ నుండి పోయి మీ ఫ్యూచర్ కాపాడుకో అంటూ హితవు పలికారు. బీఆర్ఎస్కు ఫ్యూచర్ లేదు.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..