న్యూఢిల్లీ:, 2 ఫిబ్రవరి (హిం.స) ఆసియా క్రీడలతోపాటు వచ్చే ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్ సన్నాహక అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2023-24 కేంద్ర బడ్జెట్లో క్రీడా మంత్రిత్వ శాఖకు భారీగా రూ. 3,397.32 కోట్లను కేటాయించారు. గత ఏడాదితో పోల్చితే ఇది రూ. 723.97 కోట్లు అధికం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో క్రీడారంగానికి వాస్తవంగా రూ. 3,062.60 కోట్లు కేటాయించినా.. ఆసియాడ్ వాయిదా పడడంతో ఆ మొత్తాన్ని రూ. 2,673.35 కోట్లకు కుదించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న ఖేలో ఇండియా కార్యక్రమానికి గతేడాదితో పోల్చితే రూ. 439 కోట్లు అదనంగా.. రూ. 1,045 కోట్లను, సాయ్ కేటాయింపులను రూ. 749.43 కోట్ల నుంచి 785.52 కోట్లకు, జాతీయ క్రీడాసమాఖ్యలకు కేటాయించిన మొత్తాన్ని రూ. 280 కోట్ల నుంచి రూ. 325 కోట్లకు పెంచారు. నాడా, వాడా, జాతీయ టెస్టింగ్ లేబొరేటరీ (ఎన్డీటీఎల్)లకు గతంలో సాయ్ నుంచి నిధులు అందగా.. ఈ ఏడాది నుంచి ప్రభుత్వమే నేరుగా వాటికి కేటాయింపులు చేయనుంది. వార్షిక బడ్జెట్లో నాడాకు రూ. 21.73 కోట్లు, ఎన్డీటీఎల్కు రూ. 19.50 కోట్లు, సెంటర్ ఫర్ స్టోర్ట్స్ సైన్స్ అండ్ రీసెర్చ్కు రూ 13 కోట్లు చెల్లించనున్నట్టు పేర్కొంది.
హిందూస్తాన్ సమాచార్