ఢిల్లీ, 24 మార్చి (హిం.స): ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను కేంద్ర ప్రభుత్వం సమర్పించిన సుమారు రూ.45,03,097 కోట్ల బడ్జెట్కు గురువారం లోక్సభ ఆమోదం తెలిపింది. అదానీ గ్రూప్ కంపెనీల వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్న విపక్షాలు తమ ఆందోళనను కొనసాగిస్తుండగానే బడ్జెట్ అంశాన్ని సభ చేపట్టింది. అంతకుముందు లోక్సభ రెండు మార్లు వాయిదాపడింది. సాయంత్రం 6 గంటలకు తిరిగి సమావేశమైన తర్వాత సభాపతి ఓం బిర్లా.. ప్రభుత్వ వ్యయ ప్రణాళికపై విపక్షాలిచ్చిన కోత తీర్మానాన్ని చేపట్టగా సభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యయ అంచనాలు, వినియోగ బిల్లులను చర్చ కోసం ప్రతిపాదించారు. ఆ తర్వాత సభాపతి వాటిపై ఓటింగ్ జరిపారు. విపక్ష పార్టీల సభ్యులు సభా మధ్యలోకి వెళ్లి నినాదాలు కొనసాగిస్తుండగానే అధికార పక్షం బిల్లులన్నింటికీ ఆమోదం తెలిపింది. వార్షిక బడ్జెట్కు 2/3వంతు మంది సభ్యుల మద్దతు లభించినట్లయ్యింది.
హిందుస్థాన్ సమాచార,నాగరాజ్