
పొదిలి, 7 డిసెంబర్ (హి.స.)
ప్రకాశం జిల్లాలో కలకలం. అర్ధరాత్రి రోడ్డుపై సుధీర్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు నిలిచిపోయింది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు దగ్గర అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సుధీర్ ట్రావెల్స్ బస్సు బ్రేక్ డౌన్ తో ఆగిపోయింది. ఉన్నట్లుండి బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ తరుణంలోనే అర్ధరాత్రి రోడ్డుపైనే ప్రయాణికులు చలిలో ఉండిపోయారు.
మా డబ్బులు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతామంటూ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారట ప్రయాణికులు. ఏం చేయాలో అర్థం కాక ట్రావెల్స్ యాజమాన్యానికి తెలిపారు డ్రైవర్.దీంతో ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు చెల్లించింది ట్రావెల్స్ యాజమాన్యం. విజయవాడ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ గా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV