టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ.. సీఎం రేవంత్ రెడ్డి
టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ.. సీఎం రేవంత్ రెడ్డి
Cm


యాదగిరిగుట్ట, 23 మే (హి.స.)

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి

దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. వేద పాఠశాలతో పాటు టెంపుల్ సిటీ పరిధిలో రూ. 99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు ఈ సందర్భంగా శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ సిటీని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరహాలో ఉన్నతంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.

రూ. 43.80 కోట్ల అంచనా వ్యయంతో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ వేద పాఠశాలలో సంప్రదాయ ఆశ్రమ గురుకుల పద్ధతిలో 300 మంది విద్యార్థులకు వసతితో కూడిన వేద విద్యను అందించనున్నారు. ఈ సముదాయంలో హోమాలు, యాగాలు నిర్వహించడానికి ప్రత్యేక శాలలతో పాటు ఒక గోశాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. వేద పాఠశాలకు భూమిపూజతో పాటు రూ.43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణం, కొండపై స్వామివారి నిత్య కల్యాణాల నిర్వహణ కోసం రూ. 9.87 కోట్లతో భారీ కల్యాణ మండపం, భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి రూ. 1.41 కోట్లతో రక్షణ పైకప్పు (కానోపీ) నిర్మాణం, రథశాల వైపు వాయవ్య దిశలో ఉన్న మాడవీధులకు అనుసంధానంగా రూ. 1.35 కోట్ల అంచనా వ్యయంతో కొత్త మెట్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande