
విశాఖ, 24 మే (హి.స.)
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత ప్రస్థానాన్ని ఆవిష్కరించే ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ సభ విశాఖపట్నంలో అత్యంత వైభవంగా జరిగింది. విశాఖ మద్దిలపాలెంలోని కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ ఆత్మీయ అవలోకన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దత్తాత్రేయ రాజకీయ జీవితం, ఆయన చేసిన ప్రజా సేవ, సామాన్య ప్రజలతో ఆయనకు ఉన్న బలమైన అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ వేడుకకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ... సామాన్య ప్రజల మధ్య నుంచి ఎదిగి, గవర్నర్ వంటి అత్యున్నత పదవిని అధిరోహించిన బండారు దత్తాత్రేయ జీవిత ప్రయాణం నేటి యువతకు ఎంతో ఆదర్శప్రాయమని కొనియాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi