హైదరాబాద్, 10 జూన్ (హి.స.)
దేశ అభివృద్ధిలో విద్యుత్ శాఖదే కీలక పాత్ర అని, ప్రాణాలకు తెగించి కష్టపడి పని చేస్తున్న ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించేలా రూ.కోటి ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ఎస్బీఐతో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
ఇవాళ హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి.. ఈ ఒప్పందం ఉద్యోగుల్లో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచుతుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీ తీసుకువచ్చిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 2029-30 వరకు 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా విద్యుత్ శాఖ పని చేస్తోందన్నారు. డిమాండ్కు అనుగుణంగా ట్రాన్స్మిషన్ను అప్డేట్ చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ శాఖలో పని చేసే ప్రతి వ్యక్తికి కీలక బాధ్యత ఉందని.. లైన్మెన్ నుంచి మినిస్టర్ వరకు అందరు కీలక పాత్ర వహించాలని* సూచించారు. రాష్ట్రానికి కావాల్సిన ఎనర్జీని ఉత్పత్తి చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్