న్యూఢిల్లీ, 11 జూన్ (హి.స.)
భారత్లో మే 20 తర్వాత కరోనా కేసుల సంఖ్య అధికంగా కనిపిస్తుంది. అంతరించి పోయిందనుకున్న ఈ మహమ్మారి మరోసారి రూపాంతరం చెంది.. ప్రజల ప్రాణాలను హరిస్తుంది. ఈ కొత్త వేరియంట్ ప్రభావం తక్కువే అయినప్పటికీ.. వయసు మీద పడిన వారిపై అధిక ప్రభావం చూపుతుండటంతో వారు ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అలాగే ఈ ఏడాదిలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి కారణంగా 74 మంది మృతి చెందారు.
ప్రస్తుతం ఒక్క కేరళలోనే 2,223 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్లలో కూడా యాక్టీవ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 306 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ప్రస్తుతం 7,121 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ఏపీలో 72, తెలంగాణలో 11 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..