కామారెడ్డి.11 జూన్ (హి.స.)
ఇటీవల జరిగిన పంచాయతీ కార్యదర్శి కృష్ణ హత్యకు అక్రమ సంబంధమే కారణమని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. బుధవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చిన్న కొడఫ్గల్ పంచాయతీ కార్యదర్శి దారావత్ కృష్ణ ఈ నెల 7న రెడ్డి చెరువులో హత్యకు గురయ్యాడన్నారు. పోలీసుల విచారణలో చిన్న కొడఫ్గల్ గ్రామానికి చెందిన లింగంపేట మల్కయ్య, అతని భార్య సుజాత, వారి కులస్తులు ఏరా నోళ్ళ బాలరాజు, లింగంపేట మల్కయ్య అనే నలుగురు హత్యకు కారణమని తెలియడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేసినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన మల్లయ్య భార్య సుజాతకు పంచాయతీ కార్యదర్శి కృష్ణతో అక్రమ సంబంధం ఉందని తెలిసి ఇరువురి మధ్య గొడవలు జరిగేవన్నారు. కృష్ణను హత్య చేయాలని ఇద్దరు కులస్తులు సహకారంతో పథకంలో భాగంగా ఈ నెల 5న సుజాత ఫోన్ నుంచి కృష్ణకు ఫోన్ చేసి రప్పించారని తెలిపారు. పథకంలో భాగంగా నలుగురు కలిసి కత్తి, గొడ్డలి, ఇనుప రాడ్డు, రోకలితో కొట్టి హత్య చేసి రెడ్డి చెరువులో పారేశారని తెలిపారు. ఈ మేరకు నలుగురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్టు ఎస్పీ చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్