అమరావతి, 11 జూన్ (హి.స.) అమరావతి: మద్రాసు ఐఐటీకి చెందిన నిపుణులు 12వ తేదీన రాజధాని అమరావతికి రానున్నారు. ఒకరోజు పాటు పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఐకానిక్ టవర్లు, శాశ్వత హైకోర్టు పునాదుల పటిష్టతను పరిశీలించనున్నారు. కట్టడాల నమూనాలను పరిశీలించి ఖరారుకు సంబంధించి సీఆర్డీఏ, ఐఐటీ మద్రాసు మధ్య గత తెదేపా హయాంలోనే ఒప్పందం జరిగింది. ఐదు టవర్లు, శాశ్వత హైకోర్టును ర్యాఫ్ట్ ఫౌండేషన్తో నిర్మిస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా అమరావతి నిర్మాణాన్ని గాలికొదిలేసింది. దీంతో ఈ నిర్మాణాల పునాదుల్లో ఐదేళ్లలో భారీగా నీరు నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఫ్రొ. మెహర్ప్రసాద్, ప్రొ.సుభదీప్ బెనర్జీ, ప్రొ.రాధాకృష్ణ జి.పిళ్లై నేతృత్వంలోని బృందం పర్యటించింది. పునాదులు పూర్తిగా నీటిలో మునిగిన సమయంలో పడవుల్లో పరిశీలించారు. ఐరన్, కాంక్రీట్ నమూనాలను తీసుకెళ్లి వీటి సామర్థ్యాన్ని పరీక్షించారు. నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయని, తుప్పు పట్టిన ఇనుప చువ్వలు, రాడ్లకు రసాయన తాపడం చేసి నిర్మాణ పనులు కొనసాగించవచ్చని తమ నివేదికలో సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ