తెలంగాణ, ములుగు. 11 జూన్ (హి.స.)
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ములుగు పర్యటనలో ఉన్న ఆయన బుధవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు పథకాలు పెద్ద స్కామ్ అని పేర్కొన్నారు. గులాబీ పార్టీ నాయకులు డబ్బా కొట్టుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి, మిషన్ భగీరథ పథకాలు భారీ మోసం అని, వీటిలో ఆ పార్టీ కీలక నేతలు ఇష్టారీతిన దండుకున్నారని మండిపడ్డారు.
ప్రాజెక్టుల పేరుతో పింక్ బలగాన్ని పెంచుకొని, ప్రజలపై దౌర్జన్యం చేశారని అన్నారు. తెలంగాణ జాతిపితను అని ప్రకటించుకున్న కేసీఆర్, నేడు విచారణ కమిషన్ ముందు నిలుచున్నారని ఎద్దేవా చేశారు. ఏ తప్పు చేయకపోతే ఈరోజు ఈ గతి ఎందుకు పడుతుంది అని ప్రశ్నించారు. తప్పు చేసినవారు ఎంతటి వాళ్ళైనా సరే వదిలే ప్రసక్తే లేడని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు