శుభాంశు శుక్లా రోదసియాత్ర వాయిదా.. అది సరైన నిర్ణయమే : ఇస్రో చీఫ్‌
ఢీల్లీ, 11 జూన్ (హి.స.) భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసియాత్ర మరోసారి వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఆయన బుధవారం నింగిలోకి వెళ్లాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యతో ఆ యాత్రను వాయిదా వేస్తున్నట్లు స్పేస్‌ఎక్స్‌ తెలిపింద
శుభాంశు శుక్లా రోదసియాత్ర వాయిదా.. అది సరైన నిర్ణయమే : ఇస్రో చీఫ్‌


ఢీల్లీ, 11 జూన్ (హి.స.) భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసియాత్ర మరోసారి వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఆయన బుధవారం నింగిలోకి వెళ్లాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యతో ఆ యాత్రను వాయిదా వేస్తున్నట్లు స్పేస్‌ఎక్స్‌ తెలిపింది. రాకెట్‌లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ లీక్‌ కారణంగా ప్రయోగం వాయిదా పడినట్లు ‘ఎక్స్‌’లో పేర్కొంది. దీనిపై ఇస్రో (ISRO) ఛైర్మన్‌ డా.వి. నారాయణన్‌ (Dr V Narayanan) స్పందించారు.

మానవ సహిత యాత్ర అయినందున.. ఈ ప్రయోగాన్ని వాయిదా వేయడం సరైన నిర్ణయమేనని నారాయణన్‌ పేర్కొన్నారు. ‘‘స్పేస్‌ ఎక్స్‌, యాక్సియం నిపుణులతో ఇస్రో బృందం చర్చలు జరిపింది. దీని ప్రకారం.. ప్రయోగానికి ముందు లీక్‌ను సరిచేసి, అవసరమైన ధ్రువీకరణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. మానవ సహిత యాత్ర అయినందున.. ఈ ప్రయోగాన్ని వాయిదా వేయడం సరైన నిర్ణయమే’’ అని ఆయన పేర్కొన్నారు.

షెడ్యూల్‌ ప్రకారం ఈ ప్రయోగం మంగళవారమే జరగాల్సి ఉంది. అయితే ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ ఉన్న ప్రాంతంలో వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో దీనిని బుధవారానికి వాయిదా వేశారు. సాంకేతిక సమస్య వల్ల తాజాగా మళ్లీ వాయిదా పడింది. తదుపరి తేదీని ఇంకా ప్రకటించలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande