బళ్లారి , 11 జూన్ (హి.స.): తుంగభద్ర ఆయకట్టు రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నారు. కాల్వల్లోకి నీరు రాకున్నా నారు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. నదీ జలాలు, బోర్లు, డ్యాం నీరు ఆధారంగా బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు(Ballari, Vijayanagara, Koppal, Raichur) జిల్లాల్లో 7లక్షల హెక్టార్ల ఆయకట్టు పైగా ఉంది. బోర్ల కింద సాగు చేసే రైతులు ముందుగానే వరినారు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. డ్యాంలో 80 టీఎంసీల నీరు చేరిన తరువాత ఖరీఫ్లో ఆయకట్టు సాగుకు జూలై రెండో వారంలో నీరు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రైతులు ముందుగానే నారు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పొలాలను దుక్కి దున్ని సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు.
గతేడాది తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేటు కొట్టుకుపోయి ఆయకట్టు సాగులో కొంత అంతరాయం కలిగింది. కొందరు రైతులు ఆలస్యంగా నాట్లు వేసుకున్నారు. దీంతో చివరి ఆయకట్టుకు నీరు అందకుండా పోయింది. వరి పంటే కాకుండా మిరప, పత్తి రైతులు బాగా నష్టపోయారు. ఎలాగోలా పంట పండినా ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొందరు రైతులు గోడౌన్లలో మిరపను నిల్వ చేశారు. అయినా మిరపకు ధరలు పెరగలేదు. చైనా మార్కెట్లో కూడా మిరపను తిరిగి పంపించేశారు. దీంతో మిరప రైతుకు ఆవేదన తప్పలేదు. తుంగభద్ర కింద సాగు చేసిన మిరపను ఎక్కవగా కృష్టాపట్నం, మంగళూరు పోర్టు నుంచి చైనా మార్కెట్కు తరలించారు.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి