తిరుమల12 జూన్ (హి.స.)
,:ఇటీవల ఎస్వీ గోసంరక్షణశాలపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు భవిష్యత్తులో మరింత మెరుగైన గోసంరక్షణ కోసం మరో డైరెక్టర్ను నియమించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ గోశాలలో మూడు నెలల్లో వందకు పైగా గోవులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. గోవులు అసాధారణంగా చనిపోయాయంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, కేవలం వయస్సు పైబడినవి కొన్ని, అనారోగ్యంతో మరికొన్ని మాత్రమే చనిపోయాయంటూ టీటీడీ కూడా గోవుల మరణాలపై స్పష్టత ఇచ్చింది. ఆ తర్వాత ఇదే అంశం రాజకీయ రంగు పులుముకుని సవాళ్లు విసురుకునే స్థాయికి చేరింది. అసలు గోశాలలో ఏం జరుగుతోందనే అంశంపై టీటీడీ అధికారులు ప్రత్యేక దృష్టిసారించడంతో గత ప్రభుత్వంలో జరిగిన అనేక అవినీతి అక్రమాలు విజిలెన్స్ నివేదికల ద్వారా వెలుగులోకి వచ్చాయి.
ఈ క్రమంలో గోశాలలో మెరుగైన గోసంరక్షణ కోసం టీటీడీ చర్యలకు పూనుకుంది. గోశాలలో రోజువారీ కార్యకలాపాలతో పాటు ప్రధానంగా గోవుల మరణాలను తగ్గించడానికి, సంరక్షణ, మేత, పలమనేరు, కమలయ్యగారిపల్లెలోని గోశాలల నిర్వహణ, నవనీతం వంటి వాటితో పాటు అగరుబత్తీల తయారీ, ఫీడ్ ప్లాంట్ నిర్వహణ, మినీ నెయ్యి ప్లాంట్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ(పిండ మార్పిడి) కార్యక్రమాలను డైరెక్టర్ స్థాయి అధికారి స్వయంగా పర్యవేక్షించాల్సిన అవసరముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం పశుసంవర్థక శాఖలో అనుభవం కలిగిన అధికారిని మరో డైరెక్టర్గా నియమించాలని టీటీడీ నిర్ణయించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ