తెలంగాణ, వరంగల్ 14 జూన్ (హి.స.)
కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని, ఆపరేషన్ కగార్ పేరుతో కమ్యూనిస్టులను లేకుండా చేయాలని కలలు కంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల మృతదేహాలను చూసి కేంద్రం భయపడుతోందని, పోలీసుల కాల్పుల్లో చనిపోయిన నంబాల కేశవరావు మృతదేహాన్ని ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. మావోయిస్టులు తప్పు చేస్తే చట్టప్రకారం కేసులు పెట్టాలని, 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పడం ఒక ఫ్యూడల్, గూండా, ఫాసిస్ట్ పాలనకు నిదర్శనం అని అన్నారు. మావోయిస్టులు లొంగిపోతామన్నా, చర్చలకు సిద్దం అని ప్రకటించినా హతమార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ ఒక్క నంబాల కేశవరావును చంపితే దేశంలో కోట్లాది మంది స్పందించారని, అదీ కమ్యూనిస్టులకు ఉన్న మానవతావాదానికి నిదర్శనం అని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు