తెలంగాణ, సంగారెడ్డి. 14 జూన్ (హి.స.)
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని
బీబీపేట్ గ్రామంలో శనివారం ఉదయం చిరుతపులి కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. స్థానికంగా మాజీ జడ్పీటీసీ సభ్యుడు గుండు మోహన్ ఇంట్లోకి చిరుత చొరబడి కొంతసేపు అక్కడే సంచరించిన తరువాత బయటకి వెళ్ళిపోయింది. ఇంటి ఆవరణలో చిరుత కనిపించగానే గుండు మోహన్ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై తక్షణమే ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి సహాయం కోరారు.
అప్పటికే పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ చిరుతను బయటకు పంపేందుకు గ్రామస్థులు ప్రయత్నాలు ప్రారంభించారు. చిరుత ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకెవరిపైదైనా దాడి చేస్తుందా? అన్న ఆందోళనలు గ్రామంలో పెరిగిపోతున్నాయి. పిల్లల్ని బయటకు పంపేందుకు గ్రామస్థులు భయపడుతున్నారు. వెంటనే చిరుతను పట్టుకుని అడవిలో విడిచి పెట్టాలని స్థానికులు అటవీశాఖను డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకొని చిరుత తాలూకు గల్లంతైన దిశలో గాలింపు చర్యలు చేపట్టారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు