ఇజ్రాయెల్‌ దాడిని ఖండించని భారత్‌
దిల్లీ, 15 జూన్ (హి.స.) : ఇజ్రాయెల్, ఇరాన్‌ యుద్ధంపై షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) ప్రకటించిన విధానానికి భిన్నమైన వాణిని భారత్‌ వినిపించింది. ఎస్‌సీవోలో భారత్‌ సభ్యదేశం కావడం గమనార్హం. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడిని ఎస్‌సీవో నిర్ద్వంద్వంగా ఖండించగా.. భార
ఇజ్రాయెల్‌ దాడిని ఖండించని భారత్‌


దిల్లీ, 15 జూన్ (హి.స.)

: ఇజ్రాయెల్, ఇరాన్‌ యుద్ధంపై షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) ప్రకటించిన విధానానికి భిన్నమైన వాణిని భారత్‌ వినిపించింది. ఎస్‌సీవోలో భారత్‌ సభ్యదేశం కావడం గమనార్హం. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడిని ఎస్‌సీవో నిర్ద్వంద్వంగా ఖండించగా.. భారత్‌ మాత్రం తాను గతంలో చెప్పిన విధానాన్నే అనుసరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించేందుకు అంతర్జాతీయ సమాజం కృషి చేయాలని భారత్‌ కోరింది. పశ్చిమాసియాలో పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, ఇజ్రాయెల్‌ దాడిని ఖండిస్తున్నామని ఎస్‌సీవో శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిపై స్పందిస్తూ ఎస్‌సీవోకు తమ వైఖరిని ముందుగానే తెలియజేశామని, సంస్థ విడుదల చేసిన ప్రకటనకు సంబంధించిన చర్చల్లో తాము పాల్గొనలేదని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఎస్‌సీవోలో భారత్‌తో పాటు చైనా, రష్యా, పాకిస్థాన్‌లు సభ్యత్వం కలిగివున్నాయి. ఆర్థిక, భద్రతాపరమైన అంశాలపై సహకారం అందించుకోడానికి ఏర్పడిన ఈ సంస్థకు ప్రస్తుతం చైనా అధ్యక్షత వహిస్తోంది.

ఇజ్రాయెల్‌ ఏం చేసినా కేంద్రం సమర్థన: కాంగ్రెస్‌

ఇజ్రాయెల్‌ ఏంచేసినా దాన్ని సమర్థించే నిస్సహాయ స్థితికి భారత ప్రభుత్వం చేరుకుందని కాంగ్రెస్‌ శనివారం ఆరోపించింది. ఇజ్రాయెల్‌ దాడిని ఎస్‌సీవో ఖండించగా, ఆ సంస్థలో సభ్యత్వం కలిగిన భారత్‌ మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపించడం ఇందుకు తార్కాణమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ వెలువరించిన ప్రకటనను ఆయన తప్పు పట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande