అమరావతి, 15 జూన్ (హి.స.)
i: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 20న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణించి, అదే రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోడీ జూన్ 21న ఉదయం 6.30 గంటల నుంచి 7.45 వరకు విశాఖ ఆర్కే బీచ్ లో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే యోగా డే సందర్భంగా విశాఖ బీచ్ వేదికగా ఈ వేడుక ఎంతో ఘనంగా నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
యోగా కార్యక్రమం అనంతరం మోడీ అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు. అధికారులు, పోలీస్ శాఖలు పకడ్బందీగా వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా యోగా డే కార్యక్రమం ద్వారా విశాఖ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు లభించనుందని అధికారులు భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ