అమరావతి, 15 జూన్ (హి.స.) వైసీపీ అధినేత వైఎస్ జగన్కు, ఆయన కాలకేయ ముఠాకు రాష్ట్రం అభివృద్ధి చెందడం, పేదవాడు సంతోషంగా ఉండటం నచ్చదని, అందుకే తల్లికి వందనం పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం మండిపడ్డారు. సూపర్ సిక్స్లో కీలకమైన ‘తల్లికి వందనం’ పథకం అమలయ్యేసరికి పేటీఎం గొర్రెలకు, వైసీపీ నాయకులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడిందని, ఏమి మాట్లాడాలో తెలియక అవాకులు, చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆర్థిక విధ్వంసంతో 2024 ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ స్థితికి దిగజారిందో అందరికీ తెలుసని బ్రహ్మం పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వాలంటే అప్పు కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి జగన్ జమానాలో ఉండేదని, కూటమి అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది, ఒకపక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, సూపర్ సిక్స్ అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఉత్తి బటన్లు నొక్కి డబ్బా కొట్టుకోవడం జగన్ నైజమని విమర్శించారు.
ఎన్నికల ముందు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు నొక్కేసి తనవారికి కాంట్రాక్టు బిల్లులు రిలీజు చేసిన ఘనత జగన్దని బ్రహ్మం ఆరోపించారు. జగన్ ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ తాను ఇవ్వడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం జమ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్దని అన్నారు. పాఠశాలలు తెరిచిన రోజే పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, బెల్టులు విద్యార్థులకు అందించిన ఘనత నారా లోకేశ్దని నాదెండ్ల బ్రహ్మం ప్రశంసించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి