హైదరాబాద్, 15 జూన్ (హి.స.)ఇజ్రాయిల్ నిన్న(శుక్రవారం) చేసిన దాడుల తర్వాత ఇరాన్లో ఉంటున్న భారతీయ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఒక్కసారిగా ఇజ్రాయిల్ విరుచుకుపడటంతో ఇరాన్లో భారీ నష్టమే వాటిల్లింది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది
ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించిన తర్వాత ఇరాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భీకర దాడుల్లో ఇరాన్ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించారు. అయితే దీనికి ప్రతిగా ఇజ్రాయిల్పై ఈరోజు(శనివారం) ఇరాన్ మెరుపు దాడులు చేసింది. ఇరాన్ చేసిన క్షిపణి దాడులతో ఇజ్రాయిల్లో సైతం భారీ నష్టమే వాటిల్లినట్లే తెలుస్తోంది.
ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రతరం కావడంతో ఇరాన్లో ఉన్న భారత విద్యార్థులు వణికిపోతున్నారు. ఏ సమయంలో ఏ ముప్పు ముంచుకొస్తుందో అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ వేడుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు