లిమాసోల్: , 16 జూన్ (హి.స.)మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆదివారం ద్వీప దేశమైన సైప్రస్ (Cyprus)కు చేరుకున్న విషయం తెలిసిందే. లిమాసోల్లో జరిగిన భారత్-సైప్రస్ సీఈవో ఫోరమ్లో ప్రధాని ప్రసంగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ లావాదేవీల్లో 50 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ డిజిటల్ విప్లవం భారత్లో గేమ్ ఛేంజర్గా నిలిచిందని.. ఆర్థిక, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. భారత్ వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తూ.. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే లక్ష్యంగా ముందుకువెళ్తున్నామన్నారు. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని అన్నారు.
జీఎస్టీ (GST) అమలు, కార్పొరేట్ పన్నులకు సంబంధించిన అనేక చట్టాల్లో సంస్కరణలను ప్రవేశపెడుతూ.. స్థిరమైన విధానాలను కలిగిఉండడం ద్వారా భారత్లో వ్యాపారరంగం వృద్ధి చెందుతోందని మోదీ అన్నారు. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెమీకండక్టర్లు, బయోటెక్, గ్రీన్ డెవలప్మెంట్ వంటి రంగాలపై దృష్టి సారించి, దేశ తయారీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మోదీ పేర్కొన్నారు. దీంతో త్వరలో భారత్ సెమీకండక్టర్ తయారీకి ప్రపంచ కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు