అమరావతి, 16 జూన్ (హి.స.):కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ)లో బదిలీల తంతు చూస్తే.. వడ్డించేవాడు మనోడైతే.. కడబంతిలో కూర్చొన్నా అన్ని వస్తాయి.. అన్న సామెత గుర్తొస్తుంది! పలుకుబడి ఉన్నోడికే పదోన్నతి, పోస్టింగ్ అన్న రీతిలో అధికారులు వ్యవహరించారు. ఇటీవల కొంత మంది వైద్యులకు ఇచ్చిన పదోన్నతుల్లో అధికారులు పలుకుబడినే ప్రాతిపదికగా తీసుకున్నారు. పలుబడి ఉన్న అధికారుల విషయంలో ఒకే స్టేషన్ అంటే ఒకే ఆఫీస్గా, పలుబడి లేని వారిని ఒకే స్టేషన్ అంటే ఒకే ఊరుగా భావించి బదిలీల ప్రక్రియను చేపట్టడం గమనార్హం. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో ఇదే పద్ధతిని అవలంబించారు. అధికారులు జారీ చేసిన ఆర్డర్లను వారే పాటించలేదు. వివరాలివీ.. విజయవాడలోని పటమట పీహెచ్సీలో పని చేసే ఒక సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యురాలు ఐదేళ్లుగా అదే డిస్పెన్సరీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె సాధారణ బదిలీల్లో భాగంగా స్టేషన్ మారాలి. కాబట్టి ఎనికేపాడులో ఉన్న ఈఎ్సఐ ప్రధాన కార్యాలయంలో సీఏఎస్ పోస్టు ఖాళీ ఉంటే ఆ పోస్టులోకి బదిలీ చేయాలంటూ ఆప్షన్ పెట్టుకున్నారు. ఇదే పోస్టు కోసం మరో ముగ్గురు వైద్యులు ఆప్షన్ పెట్టుకున్నారు. పటమటకూ ఎనికేపాడుకూ పెద్ద దూరం కాదు. కనుక దీనిని స్టేషన్ మారినట్లు పరిగణించాలా? లేదా ఆమెను వేరే ఊరికి బదిలీ చేయాలా అన్న విషయమై సృష్టత ఇవ్వాలని ఈఎ్సఐ ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని కోరారు. పటమట, ఎనికేపాడు విజయవాడలో భాగమే కనుక, ఆమెను వేరే ప్రదేశానికి బదిలీ చేయాలని ప్రభుత్వం నుంచి బదులు వచ్చింది. ఈమేరకు ఆ వైద్యురాలిని గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ