దిల్లీ: 17 జూన్ (హి.స.)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హడావుడిగా జీ7 వేదికను వీడి అమెరికాకు తిరుగు ప్రయాణం కావడంతో.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టెహ్రాన్ గగనతలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకొన్నామని ఇజ్రాయెల్ ప్రకటించిన వేళ.. ఈ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ఆ నగరాన్ని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ స్వయంగా హెచ్చరికలు జారీ చేయడం దీనికి ఆజ్యం పోసినట్లైంది.
ఇరాన్లోని అణుకేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి రఫాలే గ్రూసీ వెల్లడించారు. శుక్రవారం చేసిన దాడులు మినహా మిగిలినవి పెద్దగా వీటిపై ప్రభావం చూపలేదని అభిప్రాయపడ్డారు. నతాంజ్లోని భూగర్భ అణుశుద్ధి కేంద్రంపై పెద్దగా వీటి ప్రభావం లేదని పేర్కొన్నారు. విద్యుత్తు సరఫరా అంతరాయాలు వంటివి చోటుచేసుకొని అక్కడి మొత్తం 15,000 సెంట్రిఫ్యూజ్లు దెబ్బతిని ఉండొచ్చన్నారు. అంతేకానీ ఇవి ధ్వంసమై ఉంటాయని తాము అనుకోవటం లేదని వెల్లడించారు. నతాంజ్, ఫార్దో అణు కేంద్రాలను భూగర్భంలో లోతుగా నిర్మించారు. వీటిని పేల్చేయాలంటే అత్యంత భారీ శ్రేణికి చెందిన జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులు అవసరం. అవి అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు