ఢిల్లీ, 20 జూన్ (హి.స.)పరీక్షల్లో విద్యార్థుల ఫెయిల్ శాతం అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్మీడియట్ తరగతులకు కామన్ బోర్డును ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర విద్యా శాఖ సూచించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా అస్సాం, కేరళ, మణిపుర్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 7 రాష్ట్రాల్లో గత ఏడాది ఫెయిలైన విద్యార్థులు 66 శాతంగా ఉన్నారని కేంద్రం తెలిపింది. 10, 12 తరగతులకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ సిఫార్సు చేశారు.
కాగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం 66 పాఠశాల పరీక్షా బోర్డులు ఉన్నాయి. వాటిలో జాతీయ స్థాయిలో మూడు, రాష్ట్ర స్థాయిలో 63 (54 రెగ్యులర్, 12 ఓపెన్ బోర్డులు) ఉన్నాయి. టాప్ 33 బోర్డులు 97 శాతం విద్యార్థులను కవర్ చేస్తున్నప్పటికీ, మిగిలిన 33 బోర్డులు కేవలం 3 శాతం మందికి మాత్రమే అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయమని కేంద్రం అభిప్రాయ పడింది. 10, 12 తరగతులకు ఏకీకృత బోర్డు ఏర్పాటుచేయడం వల్ల పాఠశాలల పనితీరు, ఫలితాలు మెరుగుపడతాయి. ప్రామాణీకరణ లేకపోవడం వల్ల విద్యార్థుల పనితీరులో అసమానతలు తలెత్తుతున్నాయని పాఠశాల విద్యా కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు.
2024లో 22.17 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ఫెయిలయ్యారు. 20.16 లక్షల మంది విద్యార్ధులు 12వ తరగతిలో విఫలమయ్యారు. ఈ గణాంకాలు మునుపటి సంవత్సరాల కంటే మెరుగుదలను ప్రతిబింబిస్తున్నప్పటికీ, ఉన్నత విద్యకు సజావుగా మారడం, డ్రాపౌట్ రేట్లను తగ్గించడంలో ఇవి గణనీయమైన అడ్డంకిగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇక ఓపెన్ స్కూల్ బోర్డులు ఇంకా దారుణ స్థితిలో ఉన్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి