ఢిల్లీ, 22 జూన్ (హి.స.)ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ (Pahalgam) సమీపంలోని బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి (terrorist attack) యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నిర్వహించి దాడులు చేసింది. దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా.. పాక్ అభ్యర్థనతో కాల్పుల విరమణ (ceasefire)కు భారత్ అంగీకరించింది. అయితే ఈ పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack)ని సీరియస్ గా తీసుకున్న భారత ప్రభుత్వం (Government of India) కేసు విచారణను ఎన్ఐఏకి అప్పగించింది.
దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు (NIA officials) జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విచారణలో ఈ రోజు కీలక పురోగతి లభించినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్ర దాడికి పాల్పడిన వారికి ఆశ్రయం ఇచ్చిన పర్వాజ్, అహ్మద్ జోతార్ అనే ఇద్దరు నిందితులను ఈ రోజు తెల్లవారుజామున ఎన్ ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని విచారించగా.. ఇద్దరు నిందితులు.. పహల్గామ్ ఉగ్ర దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లు ఆధారాలు అందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి