భద్రాద్రి కొత్తగూడెం.23 జూన్ (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని అశ్వారావుపేట నియోజకవర్గంలో 43
వేల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అయినప్పటికీ ఎక్కడా సంబరాలు జరగకపోవడం, స్థానిక నాయకులు కూడా స్పందించకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల సొసైటీ కార్యాలయంలో రైతు భరోసా నిధులు జమ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారం చేస్తే సరిపోదని, ప్రతి స్థానిక నాయకుడు తమ గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల పై విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని, ప్రతి పథకం వెనుక కూడా అదే లక్ష్యం దాగి ఉందని, అయినా ఈ పథకాలు ప్రజల దృష్టికి రాకపోతే, ప్రయోజనం ఉండదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..