హైదరాబాద్, 23 జూన్ (హి.స.)
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎన్ని రోజుల్లో నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదని నిలదీసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నల్గొండ జిల్లా మాజీ సర్పంచ్ లతో పాటు దాఖలైన మొత్తం ఆరు పిటిషన్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. 2024 ఫిబ్రవరి 1వ తేదీతో తెలంగాణలో సర్పంచ్ ల పదవీ కాలం ముగిసిపోగా ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం 2024 జులై 5తో పూర్తయింది. నిబంధనల ప్రకారం ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని తెలంగాణ హైకోర్టులో గతంలో పిటిషన్లు దాఖలు కాగా వీటిపై ఇదివరకు సైతం వాదనలు జరిగాయి. తాజాగా ఇవాళ మరోసారి విచారణకు రాగా పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం వాదనలు పూర్తి కావడంతో స్థానిక సంస్థలపై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..