హైదరాబాద్, 23 జూన్ (హి.స.)
కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఆఫీస్ గాంధీ భవన్ లో నేడు గొర్ల కాపరుల సంక్షేమ సంఘం నేతలు వినూత్న నిరసన చేశారు. గాంధీభవన్లోకి గొర్రెలను తీసుకొచ్చి గొల్ల, కురుమలు ఆందోళన చేపట్టారు. పార్టీలో, ప్రభుత్వంలో గొల్ల, కురుమలకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేబినెట్లో యాదవ సమాజిక వర్గానికి అవకాశం ఉండేదని వారు గుర్తుకు చేశారు.
మొదటి సారి కేబినెట్లో గొల్ల, కురుమలకు అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లోనూ అవకాశం దక్కలేదన్నారు. ఈ నేపథ్యంలోనే గొర్రెలతో వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినట్లు మీడియాతో గొల్ల, కురుమ సంఘం నేతలు చెప్పారు. గాంధీభవన్లో నిరసన నేపథ్యంలో గొల్ల, కురుమల సామాజికవర్గ నేతలతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చలు జరిపారు. వారి వినతి పత్రం స్వీకరించి వారి గోడును విన్నారు. అలాగే పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరితో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని పీసీసీ చీఫ్ హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..