తెలంగాణ, కరీంనగర్. 23 జూన్ (హి.స.)
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలం సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్, విద్యుత్ ఉత్పత్తి కర్మాగారు ఏర్పాటును తక్షణమే విరమించుకోవాలని కరీంనగర్లో జరిగిన ప్రజావాణిలో బీజేపీ నాయకులు, గ్రామస్తులు కలిసి సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు వల్ల సిర్సపల్లితో పాటు చుట్టుపక్కల పది గ్రామాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఈ ప్రాంత రైతులు వ్యవసాయ భూములు నష్టపోయే అవకాశం ఉందని, భూసారం తగ్గి పంటల దిగుబడి తగ్గిపోతుందని తెలిపారు. ప్రాజెక్టును తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఈ అంశంపై సానుకూలంగా స్పందించారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు