డిల్లీ, 24 జూన్ (హి.స.)దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. గుజరాత్, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్లో బైపోల్స్ జరిగాయి. గుజరాత్లో రెండు స్థానాల్లో ఒకటి బీజేపీ, ఇంకొకటి ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఇక కేరళలో కాంగ్రెస్ గెలిచింది. పశ్చిమ బెంగాల్లోని కలిగంజ్ సీటును అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ సందర్భంగా కలిగంజ్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు.
అయితే బైపోల్లో టీఎంసీ విజయంపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పశ్చిమ బెంగాల్ యూనిట్ సహ-ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు. రక్తం చిందించకుండా టీఎంసీ ఉప ఎన్నికలో కూడా గెలవదంటూ ట్వీట్ చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీలో బాంబు పేలుడికి పదేళ్ల బాలిక మరణించిందని.. టీఎంసీ వేడుకలు రక్తంతో ముగుస్తాయని మాల్వియా ట్వీట్లో పేర్కొన్నారు. 4వ తరగతి విద్యార్థిని తమన్నా ఖాతున్ అనే చిన్న అమ్మాయి చనిపోయిందని తెలిపారు. టీఎంసీ అసలు రాజకీయ పార్టీ కాదని.. అది రాబందుల ముఠాగా అభివర్ణించారు. రక్తం చిందించకుండా గెలవలేదని తెలిపారు. సాధారణ ఎన్నికల్లో మాదిరిగా ఉప ఎన్నికల్లో కూడా పశ్చిమ బెంగాల్లో ఇదే పరిస్థితా? మమతా బెనర్జీ పాలనలో విజయానికి చెల్లించే ధర ఇదేనా? అంటూ మాల్వియా విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు