దిల్లీ, 24 జూన్ (హి.స.): పాకిస్థాన్ ప్రోద్బలంతో ఇస్లామిక్ సహకార సంస్థ(ఓఐసీ) సదస్సు భారత్ గురించి అనవసరమైన, వాస్తవ విరుద్ధమైన ప్రస్తావన తేవడాన్ని మోదీ సర్కారు సోమవారం ఖండించింది. తుర్కియేలో జరిగిన ఓఐసీ విదేశాంగ మంత్రుల రెండు రోజుల సదస్సులో అనేక అంశాలపై భారత వ్యతిరేక వ్యాఖ్యలు వెలువడ్డాయి. భారత ముస్లింలు సామాజిక వివక్షకు గురవుతున్నారని కూడా ఈ సమావేశంలో విమర్శ వినవచ్చింది. భారత్- పాకిస్థాన్లు సింధూ జల ఒప్పందంతో పాటు ద్వైపాక్షిక ఒప్పందాలన్నింటికీ కట్టుబడాలని, వివాదాస్పద అంశాలన్నింటినీ విస్తృత చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఓఐసీ పేర్కొంది. ‘‘ఓఐసీ విదేశాంగ మంత్రుల సదస్సులో భారత్కు వ్యతిరేకంగా చేసిన అనవసరమైన, వాస్తవ విరుద్ధమైన ప్రస్తావనల్ని మేం నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని గుర్తించడంలో, ముఖ్యంగా ఇటీవలి పహల్గాం ఉగ్రదాడిని ఎండగట్టడంలో ఓఐసీ విఫలమైందని, సంకుచిత రాజకీయాలకు వేదిక అయిందని విదేశాంగశాఖ స్పష్టంచేసింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు